News & Views

చర్చ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా: సిరిసిల్ల భూపతి నగర్‌లో శ్మశానవాటిక భూమిపై కబ్జాకు యత్నం

సిరిసిల్ల భూపతి నగర్‌లో శ్మశానవాటిక భూమిపై కబ్జాకు యత్నం

  • గ్రామస్తుల ఆందోళన

ప్రత్యేక ప్రతినిధి:- సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని భూపతినగర్‌లో వందల సంవత్సరాలుగా గ్రామ ప్రజల అంత్యక్రియలకు వినియోగిస్తున్న శ్మశానవాటిక భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భామనికుంటకు ఎదురుగా ఉన్న స్థలంలో తమ తాతలు, తండ్రుల కాలం నుండి శ్మశాన వాటికగా ఉపయోగిస్తున్నామని, 100-150 సంవత్సరాలుగా అంత్యక్రియలు ఇదే ప్రాంతంలో చేస్తున్నామని గ్రామపెద్దలు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా బొడ్ల వెంకటేష్ అనే వ్యక్తి ఈ శ్మశానవాటిక భూమిని కాజేయాలనే దురుద్దేశంతో, అంత్యక్రియలు చేస్తున్న భూమి తనదంటూ దౌర్జన్యానికి దిగుతున్నాడని వాగ్వాదానికి దిగారు. తమ అంత్యక్రియల హక్కుకు భంగం కలిగిస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరణించగా అంత్యక్రియ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా బొడ్ల వెంకటేష్ దౌర్జన్యంగా శ్మశానవాటికలోకి ప్రవేశించి, ట్రాక్టర్‌తో ఆ ప్రాంతాన్ని దున్నించడం కలకలం రేపింది. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ భూవివాదంపై గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేశారని, అప్పటి కమిషనర్, సంబంధిత శాఖ అధికారులు స్థలాన్ని సర్వే చేసి, అది శ్మశానవాటిక కోసమే ఉద్దేశించిన భూమి అని నిర్ధారించి, అంత్యక్రియలు నిర్వహించడానికి వాడుకోవాలని సూచించారని గ్రామస్తులు తెలిపారు. అధికారులు సర్వే చేసి స్పష్టత ఇచ్చినా కూడా బొడ్ల వెంకటేష్ తన అఘాయిత్యాలను కొనసాగిస్తున్నాడని గ్రామస్థులు మండిపడుతున్నారు. వందలాది సంవత్సరాల నుండి అంత్యక్రియలు జరుపుతున్న శ్మశానవాటిక భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న బొడ్ల వెంకటేష్‌పై అధికారులు, ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్మశానవాటిక భూమికి చట్టబద్ధమైన రక్షణ కల్పించి, తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.