చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: రెండు వారాలు శ్రమించి గొంతు కోసుకున్న వ్యక్తికి పునర్జన్మ ఇచ్చిన భద్రాద్రి టీవీవీపీ వైద్యులు
- వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ,ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
- ఇటువంటి ఆపరేషన్ చేయాలంటే గట్స్ ఉండాలన్న ఎంఎల్ ఏ తెల్లం వెంకటరావు
- చెమర్చిన కళ్ళతో డా రవి బాబు, ఇతర వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన రోగి, రోగి భార్య
![]()
రెండు వారాల క్రితం కొత్తగూడెం లో బస్టాండ్ దగ్గర నూడిల్స్ బండి నడిపే పశ్చిమ బెంగాల్ వ్యక్తి బిశాల్ తమంగ్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా గొంతుకోసుకోని ఆత్మహత్య యత్నం చేయగా , లోతుగా గొంతు తెగడం తో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు .మార్గమధ్యలో కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న డాక్టర్ రవి బాబు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేశారు.ఆశలు వదులుకున్న తరుణం లో స్వతహాగా గొంతు స్పెషలిస్ట్ అయిన డా రవి బాబు , పాల్వంచ ఆసుపత్రి సిబ్బంది తో కలిసి రెండు గంటలు శ్రమించి పాల్వంచ ఆసుపత్రి లో ఆపరేషన్ చేసి అబ్సర్వేషన్ కోసం భద్రాచలం ఐసీయూ కి తరలించారు. రెండు వారాలు పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ చికిత్స అందించినా భద్రాచలం ఐసీయూ సిబ్బంది నేడు డిశ్చార్జ్ చేశారు.
ఈ సందర్భంగా భద్రాచలం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ , భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని రోగి పరిస్థితి పై మాట్లాడారు. ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరగ వలసిన ఆపరేషన్ ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సాహసోపేతంగా గోల్డెన్ హౌర్ లో ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలిపిన డాక్టర్ రవి బాబు, పాల్వంచ ఆసుపత్రి బృందాన్ని అభినందించారు. అలాగే ఎంతో ఓపికతో ఇరవై నాలుగు గంటలు రోగికి చికిత్స చేస్తూ కోలుకోవడం లో విశేష కృషి చేసిన భద్రాచలం ఐసీయూ సేవల్ని ఆయన ప్రశంసించారు.ఈ సంఘటన జిల్లాలో బలోపేతమైన ప్రభుత్వ ఆసుపత్రి సేవలకు నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.రోగికి పునర్జన్మ ఇచ్చిన వైద్యులు దేవుళ్లతో సమానమని, రోగికి పుష్పగుచ్ఛం ఇచ్చి రాముడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రోత్సాహం తో ప్రభుత్వ వైద్యులు అద్భుతాలు సృష్టిస్తున్నారని, అందుకు నిదర్శనమే రోగి బిషాల్ తమంగ్ కి జరిగిన ఆపరేషన్ అని తెలిపారు. వైద్యులకు మనోధైర్యం ఇస్తే ఏజెన్సీ లో అయినా గొప్ప గొప్ప ఆవిష్కరణ జరుగుతాయని తెలిపారు. ధైర్యం చేసి సాహసోపేతమైన ఆపరేషన్ చేసిన డాక్టర్ రవి బాబు మరియు ఇతర వైద్యులకు వైద్య సిబ్బందిని అభినందించారు. ఆసుపత్రి సిబ్బంది విశేషంగా కృషి చేసి కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి ప్రాణం పోయడం పట్ల జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి . ఏజెన్సీ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించిన డాక్టర్ రవి బాబు, డా రామ్ ప్రసాద్, డా సోమరాజు దొర,డా ప్రసాద్, డా రామ కృష్ణ , డా మల్లేష్ , డా నిఖిత , డా కౌండిన్య, డా తేజస్వి ఇతర వైద్య సిబ్బంది ని జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్, ,భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్ రావు,పలువురు జిల్లా ప్రముఖులు, ప్రజలు అభినందనలు తెలిపారు.
క్లిష్ట సమయం లో ముందుకొచ్చి ఆపరేషన్ చేసి తన ప్రాణాలు కాపాడి తనకి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ రవి బాబు, ఇతర ప్రభుత్వ వైద్యులు,వైద్య సిబ్బంది కి రోగి తమంగ్ శాలువా కప్పి సత్కరించారు. తమంగ్ భార్య చెమర్చిన కళ్ళతో వైద్యులకి కృతజ్ఞతలు తెలిపారు.
