చర్చ: మంథని: నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
- మొదటి విడత పంచాయతీ ఎన్నికల జరిగే మండలాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
- పంచాయతీ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది తమ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
- బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మొదటి విడత పోలింగ్ జరిగే మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, కాల్వశ్రీరాంపూర్,మండలాల లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,మొదటి విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11 న జరుగుతున్నాయని, ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాల్లో చెప్పిన విధంగా నిబంధనలు పాటిస్తూ తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, ఎక్కడ ఎటువంటి అలసత్వం జరగడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
నిబంధనలు అతిక్రమిస్తూ విధులు నిర్వహించ కూడదని,ఎక్కడ ఎటువంటి వివాదాలు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలని,ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ అన్నారు.
పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని తెలిపారు.
ఎన్నికల విధిని నిర్వహించే సిబ్బందికి గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శు లు, ఎంపిడిఓ లు అవసరమైన తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, ఎలక్ట్రిసిటీ, వాహనాలు ఇతర అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ తెలిపారు.
అనంతరం మంథని పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఏసిపి రమేష్, జడ్పీ సీఈవో నరేందర్, ఆర్డీవోలు గంగయ్య,సురేష్ ,ఎంపీడీవో లు, ఎం.పి.ఓ.లు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.