
రెచ్చిపోయిన మందుబాబులు
– వైన్షాపు ఎదుటే వీరంగం… వ్యక్తిపై దాడి
చర్చ, తిరుమలాయపాలెం:
మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. అడిగిన బ్రాండ్ లేదనే కోపంతో వైన్ షాపుపై దాడికి పాల్పడి క్యాషియర్ను చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. పిండిప్రోలు గ్రామంలోని తిరుమల వైన్స్లో శుక్రవారం కొందరు వ్యక్తులు వచ్చి మద్యం సేవించారు. కొద్దిసేపటి తరువాత మరో బ్రాండ్ మద్యం కావాలని వైన్షాపు నడిపిస్తున్న వారిని అడిగారు. అయితే ఆ బ్రాండ్ తమ వద్ద లేదంటూ వైన్షాపు నిర్వాహకులు సమాధానం ఇవ్వడంతో మద్యం మత్తులో కోపోద్రిక్తులైన వారు వైన్షాపుపై దాడికి పాల్పడ్డారు. నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు. వైన్షాప్ క్యాషియర్ పాలెంపోగు కృష్ణపై దాడి చేయడంతో అతడు గాయాలపాలయ్యాడు. ఈ ఘటన మొత్తం వైన్షాపులో ఉన్న సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది. బాధితుడైన క్యాషియర్ కృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.