చర్చ, కరీంనగర్: బిజెపి సర్పంచులను గ్రామ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతాం
అధికార పార్టీకి దీటుగా బిజెపి సర్పంచులను గ్రామ అభివృద్ధిలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో ఆదర్శంగా నిలుపుతామని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం శంకరపట్నం మండలం మొలంగూర్ లో విఎస్ఆర్ గార్డెన్ లో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఎనుగుల అనిల్ అధ్యక్షతన బిజెపి ఆధ్వర్యంలో గెలిచిన ప్రజాప్రతినిధులను సన్మానించారు. ముఖ్య అతిధి గా హాజరైన జిల్లా భాజపా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ చరిత్ర తిరగరాసిందని, గతంలో కంటె మెరుగైన స్థానాలను గెలుచుకున్నామని తెలిపారు. అధికార పార్టీకి దీటుగా మండలంలో బిజెపి మంచి స్థానాలు గెలుచుకుందని, భవిష్యత్తులో శంకరపట్నంలో బిజెపి పాగా వేయడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, అందుకే పార్టీ సింబల్ తో ముందుకు పోయే ధైర్యం చేయడం లేదని, దమ్ముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం లక్షల కోట్ల నిధులు మంజూరు చేశారని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. నేడు గ్రామాల్లో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులు మోడీ ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే కొనసాగుతున్నాయన్నారు.
బిజెపి ఆధ్వర్యంలో గెలిచిన ప్రజాప్రతినిధులను గౌరవంగా చూసుకుంటామని, వారికి ఏ ఇబ్బంది కలిగిన పార్టీ అండగా ఉంటుందని బీజేపీ కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాడని తెలిపారు. అనంతరం గెలిచిన సర్పంచ్ కొయ్యడ కుమార్ యాదవ్, కొయ్యడ రజిత అశోక్, ఎన్నం మల్లేష్, మోరె స్వరుప రవి, దేవునూరి అంజలి సమ్మయ్యలను, వివిధ గ్రామల ఉప సర్పంచులు జంగ జైపాల్, పొన్నం మహేష్, చింతల శ్రీధర్ రెడ్డి, గుర్రం రేణుక శ్రీనివాసులు, వార్డ్ మెంబర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, మండల ఇంచార్జీ గుజ్జ శ్రీనివాస్, నాయకులతో పాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జీలు, వివిధ మోర్చాల నాయకులు, బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.