News & Views

చర్చ: భద్రాద్రి : కొత్తగూడెం:శిధిలావస్థలో బస్టాండ్‌

బస్టాండ్ అభివృద్ధికి సింగరేణి కేటాయించిన నిధులు ఎక్కడ?

శిధిలావస్థలో బస్టాండ్‌ – కొత్త భవనం నిర్మించాలని సీపీఎం డిమాండ్‌

బస్‌ స్టాండ్‌ వద్ద సీపీఎం ధర్నా – నాయకుల అరెస్ట్‌
బస్టాండ్ అభివృద్ధికి సింగరేణి కేటాయించిన నిధులు ఎక్కడ?

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం:

కొత్తగూడెం పట్టణంలో శిధిలావస్థకు చేరిన పాత బస్టాండ్‌ భవనం స్థానంలో కొత్త బస్టాండ్‌ను నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం టౌన్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భారీ వర్షం లో బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం టౌన్‌ కార్యదర్శి లిక్కి బాలరాజు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్‌ పూర్తిగా పాడై కూలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయని, గోడలు బీటలు వారుతున్నాయని, సిబ్బంది మరియు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు.
శిధిలావస్థకు చేరిన పాత భవనం స్థానంలో కొత్త బస్టాండ్‌ భవనాన్ని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కొత్తగూడెం నుండి గ్రామాలకు సరైన బస్‌ సౌకర్యాలు లేవని, వెంటనే బస్‌ సర్వీసులు ప్రారంభించాలని కోరారు.
బస్టాండ్‌ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగతనాలు పెరిగిపోయాయని, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలను సరిచేయాలని డిమాండ్‌ చేశారు.
సింగరేణి సంస్థ బస్టాండ్‌ అభివృద్ధి కోసం కేటాయించిన రూ.14 కోట్ల నిధులు ఎక్కడ ఖర్చు అయ్యాయని ప్రశ్నించారు. ఆ నిధులను వినియోగించి బస్టాండ్‌లో మౌలిక వసతులు కల్పించి, జిల్లా కేంద్ర బస్టాండ్‌గా అభివృద్ధి చేయాలని కోరారు.
తరువాత వారు ట్రాఫిక్‌ ఇంచార్జ్‌ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ధర్నా నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు.