చర్చ: రామగిరి: అలరించిన వెల్ బేబీ షో
సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక డిస్పెన్సరీ నందు సింగరేణి ఉద్యోగుల కుటుంబాల చిన్నారులకు నిర్వహించిన వెల్ బేబీ షో పోటీలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పోటీలలో చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషకరమన్నారు. సింగరేణి ఉద్యోగుల కుటుంబాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సింగరేణి సంస్థ ఉద్యోగుల కుటుంబాల చిన్నారులను ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచడాన్ని ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలను గత కొద్ది సంవత్సరాలుగా నిర్వహిస్తుందన్నారు. పిల్లలకు వారి చిన్నతనం నుంచే కుటుంబ బంధాలపై అవగాహణ కల్పించాలని, క్రమశిక్షణతో పాటు మంచి అలవాట్లు నేర్పిస్తే భవిష్యత్తులో రాణిస్తారన్నారు. పిల్లల అల్లరిని, ఏడుపును తగ్గించడం కోసం తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. పిల్లలను ప్రకృతికి దగ్గరగా పెంచేలా చూడాలని సూచించారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు స్థానిక రాణి రుద్రమ దేవి క్రీడా ప్రాంగణం నందు ఈనెల 23న నిర్వహించనున్న సింగరేణి దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేయబడునని తెలియజేశారు.
కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు ఎన్.అలివేణి సుధాకరరావు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు యం.రామచంద్రరెడ్డి, కోట రవీందర్ రెడ్డి, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, డాక్టర్లు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, శ్రీనివాస్, పద్మ, సేవా కార్యదర్శి ఉమాదేవి, సంయుక్త కార్యదర్శి అరుణ తదితరులు పాల్గొన్నారు.