News & Views

చర్చ సింగరేణి కొత్తగూడెం : అండర్‌గ్రౌండ్ నుంచి సర్ఫేస్ పోస్టుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం – పీవీకే-5 పిట్ కమిటీ_

_ఐఎన్‌టీయూసీ వైఖరి స్పష్టం చేయాలి - డిపెండెంట్ ఉద్యోగాలు, బకాయిలపై సమాధానం చెప్పాలని డిమాండ్_

_

చర్చ సింగరేణి కొత్తగూడెం

అండర్‌గ్రౌండ్ కార్మికులను సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా మార్చే విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నది ఏఐటీయూసీ మాత్రమేనని పీవీకే-5 గని పిట్ కమిటీ స్పష్టం చేసింది. మంగళవారం పీవీకే-5 గనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఈ వ్యాఖ్యలు చేశారు.

*ఐఎన్‌టీయూసీపై విమర్శలు:*
పీవీకే-5 గనిలో ఇటీవల జరిగిన ఐఎన్‌టీయూసీ గేట్ మీటింగ్‌లో ఏఐటీయూసీపై చేసిన విమర్శలను పిట్ కమిటీ ఖండించింది. “ఐఎన్‌టీయూసీ నాయకులు పోరాటాలు చేస్తామంటున్నారు. ఆ పోరాటాలు యాజమాన్యంపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా, లేక ఇతర కార్మిక సంఘాలపైనా అనేది స్పష్టం చేయాలి” అని డిమాండ్ చేశారు.

*డిపెండెంట్ ఉద్యోగాలు, బకాయిల అంశం:*
డిపెండెంట్ వారసులకు నియామక పత్రాలు ఇప్పించడంలో ఏఐటీయూసీ అనేక పోరాటాలు చేసిందని, ఈ విషయంలో ఐఎన్‌టీయూసీ పాత్ర ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిల విషయంలో ఐఎన్‌టీయూసీ వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు.

*మెడికల్ బోర్డు, ఇంటి పథకంపై ప్రశ్నలు:*
“మెడికల్ బోర్డును మేమే ఆపాం” అని అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఐఎన్‌టీయూసీ అభిప్రాయం చెప్పాలని కోరారు. పీవీకే-5 గనిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి “రెవెన్యూ మంత్రిగా నేనే సంతకం చేసి ఇస్తాను” అని ఇచ్చిన సొంత ఇంటి పథకం హామీ అమలుపై మంత్రిని ఐఎన్‌టీయూసీ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

*సర్ఫేస్ పోస్టులపై సవాల్:*
మణుగూరులో సర్ఫేస్ పోస్టులు తమ వల్లే వచ్చాయని చెప్పుకుంటున్న ఐఎన్‌టీయూసీ నాయకులు, కొత్తగూడెం ప్రాంతంలో ఎందుకు ఇప్పించలేకపోతున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఐఈడీ ప్రకారం కొత్తగూడెం భూగర్భ గని కార్మికులకు 270 సర్ఫేస్ పోస్టులు ఇప్పిస్తే, ఐఎన్‌టీయూసీ నిర్వహించే పాలాభిషేకంలో ఏఐటీయూసీ కండువాలతో పాల్గొంటామని సవాల్ విసిరారు.

*ఇతర అంశాలు:*
టీబీజీకేఎస్, బీజేపీ నాయకులు ప్రస్తావిస్తున్న 40 లక్షల టన్నుల బొగ్గు మాయం అంశంపై వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. “ఏఐటీయూసీతో సంబంధాలు వద్దని ఐఎన్‌టీయూసీ నాయకులు చెప్పడం హాస్యాస్పదం. అది వ్యక్తిగత అభిప్రాయమా లేక కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా స్పష్టం చేయాలి” అని పిట్ కమిటీ పేర్కొంది.

ఈ సమావేశంలో పిట్ కార్యదర్శి భూక్య రమేష్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సందీప్ సెత్, పిట్ ఉపాధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరావు, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జ్ సాయి పవన్, సేఫ్టీ కమిటీ సభ్యులు రామచందర్, సురేందర్ రెడ్డి, సంజీవ్, ప్రశాంత్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.